You might be interested in:
ఐదేళ్లలో టాప్ 500 కంపెనీల్లో కోటి మంది యువతకు నైపుణ్యాలతో కూడిన ఉపాధి అవకాశాలు అందించే లక్ష్యంతో ప్రారంభించిన పీఎం -ఇంటర్న్షిప్ పథకం(PM Internship Scheme) యాప్ను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ యాప్ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం దిల్లీలో ఆవిష్కరించారు. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్లో 300లకు పైగా దిగ్గజ కంపెనీలు భాగస్వాములు కాగా.. మరిన్ని కంపెనీలు ఇందులో చేరాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే, ఇందులో చేరి నైపుణ్యాలను పెంచుకొనేలా యువతను ప్రోత్సహించాలని ఎంపీలను కోరారు.
300+ టాప్ కంపెనీల్లో లక్షకు పైగా ఇంటర్న్షిప్లు.. దరఖాస్తు ఇలా..
2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.25లక్షల మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలను అందించడమే లక్ష్యంగా గతేడాది అక్టోబర్ 3న ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశంలోని టైర్ 1, టైర్ 2 నగరాల నుంచి యువతను ఆకర్షించడం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను వారిలో కల్పించి ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేలా వారికి సహకరించడమే ఈ స్కీమ్ లక్ష్యమని నిర్మలా సీతారామన్ తెలిపారు. పరిశ్రమల అవసరాలకు తగిన సంఖ్యలో సిబ్బంది లేరని, ఆ అంతరాన్ని తగ్గించి యువతకు నైపుణ్యాలను అందించి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొనేందుకే ఈ స్కీమ్ను తీసుకొచ్చినట్లు తెలిపారు. పీఎం ఇంటర్న్షిప్ వెబ్సైట్, యాప్లు ఎంతో బాగున్నాయని.. వేర్వేరు భాషల్లో యాక్సిస్ చేసుకోవచ్చన్నారు. ప్రతి భాషకూ తనదైన ప్రాముఖ్యత అనేది ఉంటుందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. అనంతరం కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి హర్ష్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఈ పథకం యువతకు క్షేత్రస్థాయి అనుభవాన్ని అందిస్తుందని.. తద్వారా వికసిత్ భారత్కు తోడ్పడుతుందన్నారు.
గతేడాది పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించిన ఈ స్కీమ్ మొదటి రౌండ్లో పలు కంపెనీలు 1.27లక్షలకు పైగా ఇంటర్న్షిప్ అవకాశాలు అందించగా.. ప్రస్తుతం రెండో రౌండ్ ఇంటర్న్షిప్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ రౌండ్ కింద దాదాపు 337 కంపెనీల్లో 1.18లక్షల ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించనున్నారు. ఈ ఇంటర్న్షిప్ స్కీమ్కు దరఖాస్తుల ప్రక్రియ మార్చి 31వరకు కొనసాగనుంది.
0 comment