You might be interested in:
తెదేపాలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు (Chandrababu) తీవ్ర కసరత్తు తర్వాత మూడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థుల(TDP MLC Candidates)ను ప్రకటించారు.
కావలి గ్రీష్మ(ఎస్సీ), బీద రవిచంద్ర (బీసీ), బీటీ నాయుడు(బీసీ)కు అవకాశం కల్పించారు. సోమవారంతో నామినేషన్ గడువు ముగియనుండటంతో ఎంపికైన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
అభ్యర్థుల ఎంపికలో బలహీన వర్గాలకే పెద్దపీట
వెనకబడిన వర్గాలను ఆది నుంచి ఆదరిస్తున్న తెదేపా.. తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసింది. రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజికవర్గ నేత బీటీ నాయుడుకి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. పార్టీని మొదటి నుంచీ అంటి పెట్టుకుని ఉన్న బీదా రవిచంద్రకు కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది. యువతను ప్రోత్సహించడం, మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ అవకాశం కల్పించింది.
ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఐదు స్థానాలకు ఎన్నిక జరగనుండగా.. ఒక స్థానాన్ని ఇప్పటికే మిత్రపక్షం జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరఫున కొణిదెల నాగబాబు నామినేషన్ కూడా వేశారు. మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు చంద్రబాబు కసరత్తు చేస్తున్న క్రమంలో.. భాజపాకు ఒక స్థానం కేటాయించాలని ఆ పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. తెలుగుదేశం నుంచి ఆశావహుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా భాజపాకు ఒక స్థానం కేటాయిస్తూ తెదేపా నిర్ణయం తీసుకుంది.
ఈసారి భాజపాకు ఒక సీటు ఇచ్చినందున సర్దుబాటు చేయలేకపోతున్నామని, 2027లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడుతున్నందున అప్పుడు అవకాశం కల్పిస్తామని ఆశావహులకు పార్టీ పెద్దలు సర్ది చెబుతున్నారు. ఈ మేరకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి జవహర్, దువ్వారపు రామారావు, టీడీ జనార్ధన్కు అధిష్ఠానం నుంచి ఫోన్లు వెళ్లినట్టు సమాచారం
0 comment