You might be interested in:
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం (PMIS) 2025 ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ ఇంటర్న్షిప్ కింద ఐదేళ్లలో 10 లక్షల మంది యువతకు ఇంటర్న్షిప్లను అందించనుంది.
ఈ ఏడాదికి పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ 2025 నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలవగా.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు తాజాగా ప్రారంభమయ్యాయి. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు 300కు పైగా కంపెనీల్లో లక్షకు పైగా ఇంటర్న్షిప్లను అందిస్తుంది. మార్చి 12, 2025వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఇంటర్న్షిప్కు ఎంపికైన అభ్యర్ధులకు ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో ప్రతి నెలా రూ.5 వేల చొప్పున స్టైఫండ్ ఇస్తారు. దీనితోపాటు కంపెనీలో చేరే ముందు రూ.6,000 (వన్టైం గ్రాంట్) కూడా చెల్లిస్తారు. ఏడాదిలో ఆరు నెలలు క్లాస్ రూంలో.. మిగిలిన 6 నెలలు ఫీల్డ్లో శిక్షణ ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తొలుత తమ పేర్లను వెబ్సైట్లో నమోదు చేసుకొని, ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్కు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు. 21 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతీ యువకులు ఈ ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దూరవిద్యతో పాటు పదో తరగతి పాసైన అభ్యర్థులు కూడా అర్హులే. టెన్త్తోపాటు ఐటీఐ, పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీలు కలిగివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే కుటుంబాలకు చెందినవారు, ఏడాదికి రూ. 8 లక్షల ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందినవారు ఈ ఇంటర్న్షిప్కు అనర్హులు. అలాగే ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన వారు కూడా అనర్హులే.
అలాగే ఈ ఇంటర్న్షిప్లో చేరినవారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంటుంది. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా కల్పిస్తారు. దీనికి కావాల్సిన ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆసక్తి కలిగిన వారు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం (PMIS) 2025 లింక్పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
0 comment